ఏపీలో విశాఖపై ఫోకస్ పెరిగింది. అధికార పార్టీ ఇప్పుడు విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. తాజాగా రాజ్యసభ సమావేశాలో వైసీపీ ఎంపీలు ప్రసంగించిన దాన్ని బట్టి నిశితంగా పరిశీలిస్తే వైజాగ్ డెవలప్మెంట్ షురూ అయినట్లు తెలుస్తోంది.
ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం ఎంపిన చేసినప్పటి నుంచీ రాజకీయాలు ముదరుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ పక్కనపెట్టిన ప్రభుత్వం అభివృద్ధిపైనే ప్రధాన ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తోంది. ప్రధానంగా విశాఖకు రావాల్సిన పరిశ్రమలు, నిధులు, విద్యాలయాలు ఇలా ఒకటి కాదు అన్నింటిపైనా ఇప్పటికే ఓ క్లారిటీతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. రాజ్యసభలో ఆ పార్టీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి కూడా దీన్నే ప్రస్తావించడం చూస్తే విశాఖ రూపురేఖలు మార్చి ఈ ప్రాంతం అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు అర్థమవుతోంది.
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖలో ఆయుర్వేద కళాశాల ఏర్పాటు చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి హర్షవర్థన్కు ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రం మంజూరు చేసిన 50 పడకల ఆయుష్ ఆస్పత్రి నిర్మాణం పరిస్థితిపై మాట్లాడుతూ నేషనల్ ఆయుష్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం దేశంలో 4200 ఆయుష్ హెల్త్, వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా.. ఏపీలో ఎన్ని పెట్టారన్నారు. విశాఖ నుంచి అరకు ప్రాంతానికి నడుస్తున్న రైళ్లలో కోచ్లు పెంచాలన్నారు. కాగా ఇప్పటికే కేంద్ర మంత్రులను కలవడంతో పాటు ఏపీకి ఏఏ ప్రాజెక్టులు తీసుకురావాలన్న దానిపై వైసీపీ ఫుల్ క్లారిటీతో ఉంది. విద్య, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కల్పించేందుకు త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులు వస్తాయని విశ్వసనీయ వర్గాల సమచారం. మొత్తానికి కార్యనిర్వహక రాజధానిగా మార్పు చెందుతున్న విశాఖ త్వరలోనే దేశం ఆకర్షించే స్థాయికి ఎదుగుతుందనడంలో సందేహమే లేదు.