ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్ చెబుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా పోరులో అన్లాక్4 మార్గదర్శకాలు కేంద్రం విడుదల చేయడంతో ఏపీ సర్కార్ రెడీ అయ్యింది. కేంద్రం సూచనలకు అనుగుణంగా ఏపీలో కొత్త మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. సినీ ప్రియులను నిరాశపరుస్తూ సినిమాహాళ్లకు అనుమతులు ఇవ్వలేదు.
ఈనెల 21వ తేదీ నుంచి 9,10వ తరగతి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు అనుమతులు ఇచ్చింది. వీరితో పాటు ఇంటర్ కళాశాలలు కూడా తెరుచుకోనున్నాయి. అయితే వీరి తల్లిదండ్రుల అనుమతి మాత్రం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఓకే చెప్పడంతో రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళుతుందో అన్న సందేహాలు అందరిలో ఉండేవి. నేడు విడుదల చేసిన ప్రకటనతో ఓ క్లారిటీ వచ్చినట్లైంది.
ఇక రాజకీయ నాయకులు సమావేశాలకు వంద మందికి మించకుండా నిర్వహించుకోవచ్చని తెలిపింది. దీంతో ఇన్నాళ్లూ జూమ్ వీడియోల్లో మాట్లాడిన నేతలు ఇక నేరుగా సమావేశాలు నిర్వహించుకునే అవకాశం ఉంది. ఇక ఈ నెల 20 నుంచి పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి అనుమతులు ఇచ్చింది. 21వ తేదీ నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతులు ఇచ్చింది. సినిమాహాళ్లు, ఎంటర్టెయిన్మెంట్ పార్కులు, స్విమ్మింగ్పూళ్లకు మాత్రం ఇంకా అనుమతులు ఇవ్వలేదు.
అయితే కరోనా విషయంలో ఇప్పటికీ తల్లిదండ్రులు ఇంకా భయాన్ని వీడలేదు. వ్యాక్సిన్ వచ్చే వరకు స్కూళ్లు, కాలేజీలకు పంపేందుకు సిద్ధంగా లేరన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండగా ఈ విద్యాసంవత్సరం మొత్తం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తే బాగుంటుందన్న నిర్ణయంలో తల్లిదండ్రులు ఉన్నారు. మరి జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు స్వాగతిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.