ఆంధ్రప్రదేశ్లో కరోనా కట్టడి కోసం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. వేలకు వేలుగా ఒకవైపు పాజిటివ్ కేసులు నమోదువతున్నప్పటికీ డిశ్చార్జుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇక కరోనా సామాజిక వ్యాప్తి చెందుతుందన్న వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా ప్రశంశల జల్లు కురిపిస్తోంది.
అనంతపురం జిల్లాలో అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. 1500 పడకల సామర్థ్యంతో దీన్ని అతి తక్కువ సమయంలోనే ఏర్పాటుచేసేందుకు జగన్ ప్రభుత్వం పక్కా ప్రణిళికతో ముందుకు వెళుతోంది. వేగంగా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కరోనా బారిన పడినవారికి ప్రశాంతంగా చికిత్స అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
12 బ్లాకుల్లో 1500 పడకల సామర్థ్యంతో కోవిడ్ కేర్ సెంటర్ సిద్ధమవుతోంది. కరోనా బాదితులతో పాటు వారికి సేవలందించే వైద్యులు, స్టాఫ్ నర్సులతో పాటు విధుల్లో ఉండే ప్రతి ఒక్కరికీ పురుషులు, స్త్రీలు వేర్వేరుగా షెడ్లు నిర్మించనున్నారు. పేషెంట్ల ప్రతి బెడ్ కు ఓ నెంబర్ కేటాయిస్తున్నారు. రెండు క్లినికల్ ల్యాబ్లతో పాటు ఈసీజీ, ఎక్స్రే, రక్త పరీక్షలకు ల్యాబ్లు ఏర్పాటుచేస్తున్నారు. ఈ పనులపై ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
పేషెంట్ కేర్ సెంటర్లోకి అడుగుపెట్టిన వెంటనే వారి వివరాలన్నీ నమోదు చేసుకొని ల్యాబ్లో పరీక్షలు చేయిస్తారు. ల్యాబ్లో నుంచి నేరుగా బెడ్ కేటాయించి అక్కడికి పంపించేస్తారు. ప్రత్యేకంగా ఫ్యాన్లు, పేషెంట్లు నడిచేందుకు ర్యాంపులు, ప్రత్యేక వంట గదులు ఇలా అన్నీ చకచకా నిర్మాణాలు అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ కేర్ సెంటర్ నిర్మిస్తున్న విధానం చూస్తే కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందో అర్థమవుతుంది. ఇక ప్రధాని మోడీ సీఎం జగన్తో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున తీసుకుంటున్న నివారణ చర్యల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ఈ స్థాయిలో దృష్టి పెట్టడంపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది.