ఒకప్పుడు స్టార్ దర్శకుడిగా భారీ విజయాలను సొంతం చేసుకొని, మంచి విజయాలను అందుకున్నాడు దర్శకుడు కృష్ణవంశీ. అయితే గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న కృష్ణవంశీ ఈసారి ఎలాగైనా.. భారీ విజయాన్ని అందుకోవాలనే ఉద్దేశంతో మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’ను రీమేక్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే అధికారికంగా ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్.. కరోనా కారణంగా వాయిదా పడింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో బుల్లితెర యాంకర్, నటి అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనసూయ.. నాటకాలు వేసే ఒక కళాకారిణి పాత్రలో కనిపించనుందట. అంతే కాకుండా జీవితాంతం అవివాహిత గానే ఉండే స్త్రీ పాత్రలో అనసూయ నటించనుందని సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే అనసూయ నటనకు ప్రాధాన్యత ఉన్న మరో పాత్రలో నటించనుందని అర్థమవుతోంది.
ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా నటించనున్న విషయం తెలిసిందే. కృష్ణవంశీ దాదాపు 20 ఏళ్ల తర్వాత తన సతీమణిని డైరెక్ట్ చేయనున్నాడన్నమాట. మరి ఈ సినిమాతోనైనా కృష్ణవంశీ పూర్వవైభవాన్ని అందుకుంటాడో చూడాలి.