కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా స్తంభించి పోయింది. ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సినీ తారలు కూడా లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే ఇస్తున్న సడలింపులతో.. దర్శక నిర్మాతలు సినిమా చిత్రీకరణ మొదలు పెడుతున్నారు. కరోనా కారణంగా వృధా అయిన సమయాన్ని భర్తీ చేసే పనిలో పడ్డారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ తన సినిమాల్లో వేగాన్ని పెంచారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్కాట్ ల్యాండ్ లో జరుగుతోంది. కోవిడ్ 19 కారణంగా ఆగిపోయిన చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ రెట్టింపు వేగంతో పనిచేస్తోంది. ఇలాంటి సమయంలో దర్శకనిర్మాతలకు అండగా నిలవాల్సిన బాధ్యత తనపై ఉందని నమ్మిన అక్షయ్ కుమార్ రెండు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా విదేశాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న హిందీ చిత్రం ఇదే కావడం విశేషం.