హిందీలో సూపర్ హిట్ అయిన ‘అందాధున్’ చిత్రాన్ని తెలుగు, తమిళంలో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. తెలుగులో నితిన్, నభా నటేష్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాలో తమన్నా కీలక పాత్రలో నటిస్తోంది. హిందీలో టబు పోషించిన పాత్రలో తమన్నా నటించనుంది. సినిమాకు హైలెట్గా నిలిచే ఈ పాత్రకు తమన్నా వెంటనే ఓకే చెప్పింది. ఇక సినిమాకు కీలకంగా ఉండే ఈ పాత్రకు ఎవరిని తీసుకోవాలని తమిళ చిత్ర యూనిట్ మల్లగుల్లాలు పడుతోంది.
తమిళంలో ఈ చిత్రానికి జెజె ఫ్రెడ్రిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రశాంత్ హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే బటు చేసిన పాత్రకు గాను మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందుకోసం ఐశ్వర్యని ఒప్పించేందుకుగాను సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ హీరోగా తెరకెక్కిన ‘జీన్స్’ చిత్రంలో ఐశ్వర్య రాయ్ గతంలో నటించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ప్రశాంత్తో నటించేందుకు ఐష్ ఓకే చెప్తుందో లేదో చూడాలి. ఇక ఐశ్వర్య ఈ సినిమాకు ఓకే చెప్పితే తన కెరీర్లో నెగిటివ్ రోల్లో నటించనున్న తొలిపాత్ర ఇదే అవుతుంది. మరి ఐశ్వర్య ఈ చిత్రంలో నటిస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.