ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటీవల కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డిలు జైలుకు వెళ్లక తప్పదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ఈ రోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజీనామా డ్రామాకు రేవంత్ తెరదించాలని అన్నారు. దమ్ముంటే రాజీనామాను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఇవ్వాలని, అమరావతిలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రికి కాదని మండిపడ్డారు.
నెల రోజులు జైల్లో ఉన్న రేవంత్ నేరస్వభావంతో మాట్లాడుతున్నారని అన్నారు. ఊసరవెల్లిలా అనేక పార్టీలు మారారని విమర్శించారు. పబ్ లు, డ్రగ్స్ విషయంలో ఆధారాలు ఉంటే ముందుకు రావాలని అన్నారు. సన్ బర్న్ షో, రెహమాన్ షో, మ్యూజిక్ ప్రోగ్రామ్ లకు కేటీఆర్ కు గానీ, ఆయన బావమరిదికి కానీ ఎలాంటి సంబంధం లేదని… ఈ తప్పుడు ఆరోపణలను నిరూపించలేక పోతే రేవంత్ రెడ్డి ముక్కును నేలకు రాయాలని సవాల్ విసిరారు.