దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలలో కరోనా కట్టడికి మరిన్ని నిబంధనలు అమలు చేస్తున్నారు. తాజాగా కేసులు నమోదవుతున్నా రికవరీ రేటు కూడా దేశంలో ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగానే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
భారత్లో కరోనా కేసుల సంఖ్య 94 లక్షలను దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ సోమవారంనాడు ప్రకటించింది. గత 24 గంటల్లో 38,772 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 94,31,692కు చేరిందని, వీటిలో 4,46,952 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. 88,47,600 మందికి స్వస్థత చేకూరినట్టు పేర్కొంది. కొత్తగా 443 మంది మృతి చెందడంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,37,139కు చేరింది. నేషనల్ రికవరీ రేటు 93.71గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారంనాడు ప్రకటించింది.
అత్యంత కనిష్టంగా కోవిడ్ మరణాలు చోటుచేసుకున్న ప్రపంచ దేశాల్లో ఒకటిగా భారత్ కొనసాగుతోందని తెలిపింది. ఇంతవరకూ దేశంలో 14,03,79,976 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, ఒక్క ఆదివారంనాడే 8,76,173 పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. 50,000 కంటే తక్కువ కేసులు నమోదు కావడం ఇది వరుగా 23వ రోజని పేర్కొంది. చివరి సారిగా నవంబర్ 7న 50,000 మార్క్ను దాటింది.