భారతీయ సాంప్రదాయం ప్రకారం దీపావళి పండుగను ఎంతో ప్రధాన్యత ఇస్తారు. చెడును మంచి జయించిన సందర్బంగా సంతోషంగా దీపాలు వెలిగిస్తూ సంబరాలు చేసుకుంటారు. అయితే ఈ సారి కరోనా విజృంభణ నేపథ్యంలో దీపావళిపై పలు ఆంక్షలు ఉన్నాయి. కేవలం దీపాలు వెలిగించి చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. కాలుష్యాన్ని పెంచే టపాసులు కాల్చకూడదని చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఓ ప్రాంతంలో దీపావళి రోజు 5 లక్షల దీపాలు వెలగబోతున్నాయి. దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని అయోధ్యలో భారీ సంఖ్యలో దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. 5 లక్షల 51 వేల ప్రమిదలతో భారీగా దీపావళిని జరుపుకోవాలని నిర్ణయించారు. దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి అయోధ్యకు చేరుకున్నారు. ఇలా 5 లక్షల దీపాలను వెలిగించి రికార్డుల్లోకెక్కనున్నారు. అయితే కరోనా కారణంగా ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే హాజరు కావాలని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. అయినప్పటికీ భక్తులు మాత్రం భారీగానే వస్తున్నారు.
అయోధ్యకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. శుక్రవారం పది గంటలకు రాముడి జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఉన్న పటాలతో 11 రథాలను ట్రస్టు సిద్ధం చేసింది. ఈ ప్రదర్శన సాకేత్ మహా విద్యాలయం నుంచి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం యోగి అక్కడికి చేరుకుంటారు. రామ్ లల్లా దర్శనం చేసుకొని దీపాలను వెలిగిస్తారు. ఇలా అయోధ్యలో దీపావళి ఘనంగా జరుగనుంది. ఈ అద్బుత కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.