కాశీ గురించి తెలియని వారుండరు. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో కాశీ ఒకటన్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి కాశీలో భద్రతను అధికారులు ఛాలెంజ్గా తీసుకున్నారు. లక్షల మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు పకడ్బంధీగా తీసుకుంటున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ సొంత నియోజకవర్గ కేంద్రమైన ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో 3వేల సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. అధునాతన భారతీయ, యూరోపియన్, అమెరికన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముఖ గుర్తింపు కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వారణాసి స్మార్ట్ సిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గౌరంగ్ రతి తెలిపారు. అవసరమైతే ముఖ గుర్తింపు కెమెరాల సంఖ్యను పెంచుతామని ఆయన చెప్పారు.720 ప్రాంతాల్లో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీటిని కమాండ్ కంట్రోల్ సెంటరుతో అనుసంధానించారు. రూ.128 కోట్లతో ఆప్టికల్ ఫైబర్ లైన్ వేస్తున్నామని కమిషనర్ చెప్పారు.
ముఖ గుర్తింపు కెమెరాలు నేరస్థులను సులభంగా పట్టుకుంటాయని కమిషనర్ చెప్పారు. వాంటెడ్ క్రిమినల్ను ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలో బంధిస్తే, అది కెఐసిసిసి వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. వారు సంబంధిత పోలీస్ స్టేషనుకు తెలియజేస్తారు. దీంతో పోలీసులు వచ్చి నేరస్థుడిని అరెస్టు చేస్తారు.నిత్యం లక్షలాది మంది భక్తులు సందర్శిస్తున్న వారాణాసి నగరంలో స్మార్ట్ నిఘా వ్యవస్థ ఏర్పాటుతో నేరగాళ్ల సంచారంపై నిఘా పెరగనుంది.