దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్థవ్యస్థంగా మారిపోయింది. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కూడా వర్షం దంచికొడుతోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు 27 మంది చనిపోయారు.
పూణే, షోలాపూర్, సాంగ్లీ జిల్లాల్లో కురుస్తున్న భారీవర్షాల వల్ల 27 మంది మరణించారు. దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైతో పాటు పూణే, షోలాపూర్, సాంగ్లీ జిల్లాల్లో భారీవర్షాల వల్ల పలు లోతట్టుప్రాంతాల్లో వరదనీరు నిలిచిపోయింది. లోతట్టుప్రాంతాల్లో నివాసముంటున్న 20వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెండు రోజుల నుంచి ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో షోలాపూర్ జిల్లాలో 14 మంది, సాంగ్లీ జిల్లాలో 9 మంది, పూణే జిల్లాలో నలుగురు మరణించారని పూణే డివిజనల్ కమిషనర్ చెప్పారు. షోలాపూర్ జిల్లా పంధార్ పూర్ పట్టణంలో గోడ కూలిపోవడంతో ఆరుగురు మరణించారు.
పూణే నగరంలో బుధవారం 96 మిల్లీమీటర్లు, కొల్హాపూర్ లో 56 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ముంబైలో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో శుక్రవారం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటిస్తున్నట్లు సీఎం ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించాలని నిర్ణయించారు. ఇక ఏపీ, తెలంగాణాలో కూడా మరో రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.