తనదైన దర్శకత్వ ప్రదర్శనతో తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. కొన్నేళ్ల నుంచి దర్శకత్వానికి దూరంగా ఉంటూ వస్తోన్న సింగీతం ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. అక్కినేని సమంత ప్రధాన పాత్రలో ఓ బయోపిక్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బెంగళూరు నాగరత్నమ్మ జీవిత కథ ఆధారంగా స్క్రిప్టును రెడీ చేస్తున్నారట.
అయితే సింగీతం వయసు పైబడింది అందులోనూ.. ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్నారు. ఈ కారణంగా ఆయన చిత్రానికి దర్శకత్వం వహిస్తారా.? లేదా పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుత తరాన్ని ఆకట్టుకోవడానికి సింగీతం ఈ చిత్ర కథను పకడ్బందీగా రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమా ప్రకటన రాగానే బెంగళూరు నాగరత్నమ్మ ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. నాగరత్నమ్మ సాంస్కృతిక ఉద్యమకారిణి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు. 1878లో జన్మించిన నాగరత్నమ్మ త్యాగరాజ ఆరాధోత్సవాల్లో స్త్రీలకు ప్రాధాన్యత ఉండాలని గళమెత్తి పోరాడారు. ఒక గొప్ప సంఘసంస్కర్తగా ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఇలాంటి ఒక గొప్ప మహిళ పాత్రలో సమంత ఎలా నటిస్తుందో చూడాలి.