భారత ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఎవరికీ చెప్పా పెట్టకుండా చైనా సరిహద్దుల్లో లఢక్ లో పర్యటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మోడీ సైనికులకు భరోసానిచ్చిన తీరు చూసి దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. సరిహద్దుల్లోకి వెళ్లి మరీ చైనాపై తొడకొట్టిన తీరుతో దేశభక్తి ఉప్పొంగింది. భారత సైనికుల్లో కొండంత స్థైర్యం నింపింది.
కాగా మోడీ లఢక్ పర్యటన చైనా అధికారుల్లో వణుకు పుట్టించింది. ప్రధాని మోడీ లఢక్ పర్యటనపై చైనా తన అసంతృప్తిని వెళ్లగక్కింది. భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని చైనా విదేశాంగ శాఖ అధికారప్రతినిధి ఝావో లిజియాన్ స్పష్టం చేశారు.
సైనిక దౌత్యపరంగా చర్చలు జరుపుతున్న సమయంలో పరిస్థితి తీవ్రతను పెంచే ఎలాంటి చర్యల్లో ఎవరూ పాల్గొనకూడదని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ ప్రకటించారు.
ఈ ఉదయం గల్వాన్ ఘర్షణ అనంతరం చైనా దూకుడుగా వ్యవహరిస్తూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఏకంగా లఢక్ లో పర్యటించారు. రక్షణమంత్రి పర్యటించాల్సి ఉండగా.. మోడీనే రావడం సంచలనమైంది. ఈ పర్యటనలో ఆర్మీ వైమానిక ఐటీబీపీ ఉన్నతాధికారులతో ప్రధాని చర్చించారు. చైనాకు తన ప్రసంగంలో హెచ్చరికలు పంపారు. మోడీనే రంగంలోకి దిగడంతో చైనా ఉలిక్కిపడింది. ఇలాంటివి చేయవద్దంటూ చైనా అధికార ప్రతినిధి స్పందించడం గమనార్హం.