నిజంగా చెప్పాలంటే కొద్ది రోజుల క్రితం చెడ్డీ గ్యాంగ్ పేరు చెబితేనే గుండెల్లో రైళ్లు పరుగెట్టాయి. చెడ్డీలపై వచ్చి దొంగతనాలు చేస్తూ ప్రజలకు భయం పుట్టించింది ఈ గ్యాంగ్ అయితే ఇప్పుడేమీ లేదనుకుంటే.. చడీ చప్పుడూ లేకుండా మళ్లీ ఈ ముఠా వచ్చిందా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.
ఒంటిపై ఒక్క డ్రాయర్ మాత్రమే వేసుకొని ఒళ్లంతా నూనె పూసుకొని హైదరాబాద్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. హైదరాబాద్ ప్రజలకు నిద్రలేకుండా చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు తెగబడింది. ప్రధానంగా వీరు శివారు కాలనీలు, నిర్మానుష్య ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఉంటారు. కనిపించిన వారిపై దాడులు చేస్తూ ఇళ్లలో దోపీడీలకు పాల్పడుతుంటారు. హైదరాబాద్ ఘటనల తర్వాత ఏపీ తెలంగాణా ప్రశాంతంగానే ఉన్నాయి.
తాజాగా ఇప్పుడు రాజమహేంద్రవరంలో జరిగిన చోరీలు చెడ్డీ గ్యాంగ్ పనేనా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. రాజమహేంద్రవరంలోని వెంటేశ్వర నగర్లో మొన్న చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసినట్లు తెలుస్తోంది. రెండు ఇళ్లల్లో చోరీలకు విఫలయత్నం జరిగిన ఘటనలో సీసీ కెమరాలు పరిశీలిస్తే దొంగలు చెడ్డీలతో కనిపిస్తున్నారు. దీంతో మళ్లీ ఈ ముఠా వచ్చిందన్న భయం పట్టుకుంది. గతేడాది కూడా ఇక్కడ చోరీకి ప్రయత్నించారు. ఈ సారి చోరీకి పాల్పడ్డ ఇళ్లు అడిషనల్ ఎస్పీది కావడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
ఈ ముఠా చిత్తూరు చెందినదన్న విషయం తెలిసిందే. దొంగతనానికి వస్తే అక్కడ ఎవరున్నా వారిపై దాడులు చేసి దోపిడీ చేస్తారు వీరు. మరి ఈ విషయంలో పోలీసు డిపార్టుమెంట్ ఏం చేస్తుందన్న దానిపై ఉత్కంఠత నెలకొంది. అయితే చెడ్డీ గ్యాంగ్ వచ్చిందన్న సమాచారంతో మాత్రం ప్రజలు భయపడిపోతున్నారు.