సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఎంతో మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు రజినీని అభిమానిస్తుంటారు. రజినీకాంత్ కూడా కాంట్రవర్సీలు దూరంగా ఉంటూ తన సినిమాలు తాను చేసుకుంటూ పోతుంటాడు. అందుకే ఆయనకు అంత మంది అభిమానులున్నారు.
ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు రజనీకాంత్ గొప్పతనం గురించి అడపాదడపా ఇంటర్వ్యూల్లో చెప్పారు. తాజాగా నటి నివేదా థామస్ కూడా రజనీకాంత్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చింది. దర్బార్ చిత్రంలో నివేదా థామస్ రజనీకి కూతురిగా నటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రజనీతో తనకు ఏర్పడ్డ అనుబంధం గురించి మాట్లాడుతూ.. ‘షూటింగ్ స్పాట్లో రజినీ చిన్నపిల్లాడిలా చురుకుగా ప్రవర్తిస్తుంటారు. తోటి నటీనటులతో కబుర్లాడుతూ ఎప్పుడు హ్యాపీ మూడ్లో ఉంటారు.
తొలిరోజు షూటింగ్కు హాజరైన తనను చూసి ‘ఈ అమ్మాయా. ఆమె నటించిన సినిమాలు చూశాను. చాలా చక్కగా నటించింది’ అంటూ మెచ్చుకోవడం నన్ను ఆశ్చర్యపరచింది. ఆహార కట్టుబాట్లు, ఆధ్యాత్మిక పరమైన సంగతులు చెబుతూ షూటింగ్ స్పాట్లో ఉన్న అందరితోనూ రజినీ స్నేహంగా వ్యవహరించడం చూసి ఆశ్చర్యపోయాను’ అని నివేదా చెప్పుకొచ్చింది.