అంత పోటుగాడివైతే పార్టీ పెట్టుకోవచ్చు కదా..!!

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం కాకరేపుతోంది. ఏకంగా వైసీపీ అధిష్టానంపైనే రఘురామ కృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా, మంత్రులు పేర్ని నాని, రంగనాథరాజు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీ వద్ద మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఎంపీ రఘురామకృష్ణంరాజు అంత పోటుగాడైతే సొంత పార్టీ పెట్టుకోవాలని సవాల్ విసిరారు.

2014లో వైసీపీ, టీడీపీ, బీజేపీ తరఫున చివరకు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన నువ్వు ఎందుకు విత్ డ్రా చేసుకున్నావని ప్రశ్నించారు. అంత పోటుగాడువైతే సొంతగా పార్టీ పెట్టుకోవచ్చు కదా అని సవాల్ విసిరారు. గత ఎన్నికల ముందు సీఎం జగన్‌ను కలిపించాలని బతిమాలారని, పార్టీకి క్షమాపణలు చెప్పుకుంటానని చెప్పి పార్టీలో చేరి ఈరోజు ఇలా మాట్లాడటం సరికాదన్నారు.

2014 ఎన్నికల సమయంలో తొలుత పార్టీని వీడిన రఘురామ కృష్ణంరాజు బతిమాలి మరీ పార్టీలో తిరిగి చేరారని మంత్రి నాని పేర్కొన్నారు. తన వల్లే నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు గెలిచారని చెప్పుకుంటున్న రఘురామ కృష్ణంరాజు ఎమ్మెల్యేలకు ఎన్ని ఓట్లు పడ్డాయో ఆయనకు ఎన్ని ఓట్లు పడ్డాయో చూసుకోవాలని ఎద్దేవా చేశారు.

ఆయనే ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఎమ్మెల్యేలకు ఎక్కువ ఓట్లు, ఎంపీకి తక్కువ ఓట్లు ఎలా వచ్చాయని మంత్రి ప్రశ్నించారు.దివంగత వైఎస్సార్ బొమ్మ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కష్టం వల్లే అధికారంలోకి వచ్చామని మంత్రి పేర్ని నాని ఉద్ఘాటించారు. రాఘురామ కృష్ణంరాజు పార్టీని వీడాలనుకుంటే వీడొచ్చని సూచించారు. అంతేతప్ప అడ్డగోలు మాట్లాడటం సరికాదన్నారు. పక్క చూపులు చూసిన ఎమ్మెల్యేలు, ఎంపీల పరిస్థితి ఏమయ్యిందో అందరికీ తెలుసునని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here