ప్రముఖ ముబైల్ మ్యాన్యుఫ్యాక్ఛరింగ్ సంస్థ యాపిల్కు భారీ ఫైన్ పడినట్లు తెలుస్తోంది. కొలంబియాతో పాటు వివిధ రాష్ట్రాల్లోని అటార్నీ జనరల్స్ విడుదల చేసిన నివేదికల ప్రకారం ఈ విషయం వెల్లడవుతోంది. వినియోగదారుల మొబైల్స్కు అప్డేట్ రూపంలో ఓ సాఫ్ట్వేర్ను పంపించి, దాని ద్వారా మొబైల్ స్లో అయ్యేలా యాపిల్ చేస్తోందని 2018లో అనేక రెగ్యులేటరీలు ఫిర్యాదు చేశాయి.
దీనిపై అనేక రాష్ట్రాల అటార్నీ జనరల్స్ విచారణ చేపట్టారు. అప్పట్లో యాపిల్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంది. మొబైల్స్లో ఎక్కువ రోజులు వినియోగించడం వల్ల అందులోని బ్యాటరీలు దెబ్బతింటాయని, అందుకే మొబైల్ను స్లో చేయడం ద్వారా దానిని తగ్గిస్తున్నామని చెప్పింది. అయితే రెగ్యులేటరీలు మాత్రం ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. యాపిల్.. తమ కొత్త మొబైల్స్ అమ్ముకునేందుకే వినియోగదారుల వద్ద ఉన్న పాత మొబైల్స్ పనిచేయకుండా చేస్తోందని ఆరోపించాయి.
ఈ నేపథ్యంలో విచారణ పూర్తి చేసిన అటార్నీ జనరల్స్ యాపిల్ను దోషిగా తేల్చారు. 113 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.839 కోట్లు) చెల్లించాలని తీర్పు చెప్పాయి. అయితే యాపిల్ మాత్రం తమదేం తప్పులేదని చెబుతోంది. యాపిల్ చెల్లించనున్న మొత్తం జరిమానా అమెరికాలోని కొలంబియాతో పాటు దాదాపు 33 రాష్ట్రాలకు అందనుంది. అయితే ఈ విషయంలో మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది. ఇక యాపిల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.