బీహార్ రాజకీయాల్లో సంచలనాలు జరుగుతూనే ఉన్నాయి. నితీష్ కుమార్ మంత్రివర్గంలో ప్రమాణం చేసిన మంత్రి ఒక్క రోజులోనే తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. దీంతో బీహార్ రాజకీయలు మళ్లీ దేశంలో చర్చనీయాంశం అయ్యాయి.
నితీశ్ కేబినెట్ లో విద్యా మంత్రిగా ఉన్న మేవాలాల్ చౌధురి (జేడీయూ) తన మంత్రి పదవికి గురువారం రాజీనామా చేశారు. మేవాలాల్ చౌధురి గురువారమే బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన కొద్ది గంటల్లోనే రాజీనామా చేయడం కొసమెరుపు. అసలేమైందంటే.. భాగల్పూర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా ఉన్న సమయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని, అందులో మేవాలాల్ పాత్ర కూడా ఉందని 2017 లో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది.
దీంతో ఆయన్ను జేడీయూ నుంచి నితీశ్ అప్పట్లో సస్పెండ్ చేశారు. ఈ ఆరోపణలపై విచారణ చేయాలని అప్పటి గవర్నర్ రాంనాథ్ కోవింద్ అధికారులను ఆదేశించారు. ఆ ఆరోపణలు నిజమని అధికారుల దర్యాప్తులో తేలింది. అయినా సరే… ఇప్పటి వరకూ మేవాలాల్పై ఎలాంటి ఛార్జ్షీట్ దాఖలు కాలేదు. 2017 కేసును ప్రతిపక్ష ఆర్జేడీ తాజాగా తిరగదోడింది. ఈయన భార్య నీతూ చౌధురి 2019 లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె నివాసంలోనే పూర్తి స్థాయిలో శరీరం కాలిపోయి కనిపించారు.
ఈ వ్యవహారంలో మేవాలాల్ పాత్ర కూడా ఉందని ఆర్జేడీ ఆరోపిస్తోంది. వీటిని ఆధారంగా చేసుకొనే ప్రతిపక్ష ఆర్జేడీ మేవాలాల్ పై రెండు రోజులుగా తీవ్రమైన ఆరోపణలు చేయడంతో పాటు ఆయన పాత్రపై విచారణ చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తోంది.