వైసిపి అధినేత జగన్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. జగన్ దమ్ము ధైర్యం లేని వ్యక్తి అని విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ ఆదినారాయణ రెడ్డి ప్రతిపక్ష నేత జగన్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు పై విమర్శించే హక్కు లేదని అన్నారు. బెంగళూరులో, అలాగే లోటస్పాండ్లో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్లను ఆస్తుల్లో ప్రకటించుకునే దమ్ము, ధైర్యం లేని నీవు చంద్రబాబు గురించి మాట్లాడుతావా..? అంటూ జగన్పై ప్రశ్నల వర్షం కురిపించారు.
సీఎం చంద్రబాబు నాలుగో నెల ఏప్రిల్ 20వ తేదీన పుట్టాడుకాబట్టి.. 420 అంటూ జగన్ ఎద్దేవ చేస్తున్నాడని, ఆ లెక్కన వైఎస్ జగన్ను 12 కేసుల్లో 420గా చేరుస్తూ కేంద్ర ప్రభుత్వ నేర పరిశోధన (ఈడీ, ఏసీబీ) సంస్థలు కేసులు నమోదు చేశాయన్నారు. కేవలం 5 మంది ఎంపీల చేత రాజీనామాలు చేయించి జగన్ చంకలు గుద్దుకుంటున్నాడని, నాడు బోఫర్స్ కుంభకోణం సమయంలో 35 మంది ఎంపీల చేత రాజీనామా చేయించిన ఘనత టీడీపీదేనన్నారు మంత్రి ఆదినారాయణరెడ్డి.
అధికార దాహం కోసం జగన్ రోడ్డుమీద ఏది పడితే అది మాట్లాడుతూ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారని అన్నారు. జగన్ జీవితంలో ముఖ్యమంత్రి అవలేరు ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో ఓటమి చెంది జైలుకు వెళ్తారు అని అన్నారు. నీతిపరుడైన చంద్రబాబుపై లేనిపోని మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు ఆదినారాయణ రెడ్డి.