ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేక హోదా అంశం అధికార విపక్ష పార్టీల మధ్య మంచి వేడి పుట్టిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప ప్రతిపక్ష నేత జగన్ మీద విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగానే చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ….ప్రతిపక్షనేత జగన్ బీజేపీ పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ధ్వజమెత్తారు.అందుకే జగన్- బీజేపీలు ఒకరి పై ఒకరు ఎన్నడూ విమర్శలు చేసుకోవడంలేదని ఆరోపణలు చేశారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని జగన్ అన్న తర్వాత కూడా బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.
ఇక బీజేపీ మంత్రుల రాజీనామాల గురించి మాట్లాడుతూ.., రాజీనామాలు చేయటం వారి ఇష్టమని.. బీజేపీ విషయంలో తామిప్పటికీ మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని చినరాజప్ప అన్నారు.అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వేసిన కమిటీ గురించి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అద్భుతంగా పోరాడుతున్నారని కితాబు ఇచ్చారు హోంమంత్రి చినరాజప్ప.