తమిళ నటుడు విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమా విడుదల నాటి నుంచి ఆ సినిమాపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ తమిళాడు శాఖ అథ్యక్షుడు హెచ్.రాజా విజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయ్ ఓటర్ ఐడీని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, విజయ్ మతం మార్చుకున్నాడని, దానికి నిదర్శనంగా సీ జోసెఫ్ విజయ్ అని పేరుందని ఆరోపించారు. దీనిపై విజయ్ తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడ్ని జోసఫ్ విజయ్ అని సంబోధిస్తున్నారు…ఆ పేరులో తప్పేముంది? అని ప్రశ్నించారు.
తన పేరు చంద్రశేఖర్ అని చెప్పిన ఆయన, తనది శివుడి పేరని తెలిపారు. విజయ్ క్రిస్టియనో లేక ముస్లిమో అదీ కాక హిందువో కాదని స్పష్టం చేశారు. విజయ్ ఒక మనిషి అని, అంతకుమించి భారతీయుడని ఆయన తెలిపారు. తనను అడిగితే ప్రజలకు సేవచేసేందుకు విజయ్ రాజకీయాల్లోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. విజయ్ నిర్ణయమే అంతిమమన్న ఆయన, తాను బలవంతం చేయనని అన్నారు. ‘మెర్సల్’ సినిమాలో చర్చనీయాంశమైన అంశాలను తొలగించేందుకు నిర్మాత అంగీకరించిన తరువాత కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందా? అని ఆయన మండిపడ్డారు.