ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని… జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నిన్న పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలకు నాని కౌంటర్ ఇచ్చారు. బోడి లింగం ఎవరో.. శివ లింగం ఎవరో ప్రజలకు తెలుసని కొడాలి నాని అన్నారు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో మంగళవారం జరిగిన పేదలకు ఇల్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవనే పెద్ద బోడి లింగమంటూ విరుచుకుపడ్డారు. తామంతా శివలింగాలం కాబట్టే మచిలీపట్నం, గుడివాడ ప్రజలు తమను నెత్తిమీద పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఆయన పెద్ద బోడిలింగం కాబట్టే గాజువాక, భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారని విమర్శించారు. ప్యాకేజీలు తీసుకొని, ఎవరో రాసిన స్క్రిప్టులు చదివే పచ్చకామెర్లు సోకిన యాక్టర్లను ప్రజలు నమ్మరన్నారు. ప్రజల తిరస్కారానికి గురైన పవన్ సిగ్గు, శరం లేకుండా మాట్లాడటం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. పవన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం దురదృష్టమన్నారు.
గుడివాడ, మచిలీపట్నంలలో సోమవారం పర్యటించిన పవన్… మంత్రి కొడాలి నానిపై పంచ్ డైలాగులతో విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. గుడివాడ జంక్షన్లో నాని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నిస్తే.. ఒక్కొక్కరూ బూతులు తిడుతుంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటి? నానియా? వైసీపీలో నానీలు ఎక్కువమంది. ఏదో ఒక నాని. ఏ నానో నాకు అర్థం కావడం లేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం’’ అన్న కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నాని ఫైర్ అయ్యారు.