సూపర్స్టార్ రజినీకాంత్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజకీయ రంగ ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. మరికొద్దిరోజుల్లో అంటే మరో వారం రోజుల్లో ఆయన రాజకీయ పార్టీకి సంబంధించిన పూర్తి సమాచారం బయటకు రానుంది. ఈ మేరకు ఆయన ఇదివరకే చెప్పిన విధంగా పార్టీ పేరు, గుర్తును ప్రకటించే సమయం వచ్చేసింది.
రజనీకాంత్ ఈనెల 31న చెన్నైలో జనవరిలో తాను ప్రారంభించబోయే పార్టీ పేరు ప్రకటించడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు రజనీ మక్కల్ మండ్రం నిర్వాహకులు నగరంలోని రాఘవేంద్ర కల్యాణమండపంలో ఏర్పాట్లను చేపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ‘అన్నాత్తే’ షూటింగ్లో కొందరికి పాజిటివ్ లక్షణాలు బయటపడటంతో ఆయన అక్కడే ఐసోలేషన్లో వుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ప్రకటన చేయడానికి రజనీ ఈనెల 27నగానీ, 28న గానీ హైదరాబాద్ నుంచి చెన్నై తిరిగి వస్తారని మండ్రం నేతలు తెలిపారు.
ఆ తర్వాత రజనీ మక్కల్ మండ్రం నేతలతో మరోమారు సమావేశమవుతారు. ఈ సమావేశంలో పార్టీ పేరు, చిహ్నం, పతాకం గురించి మండ్రం నేతలతో ఆయన చర్చలు జరుపుతారు. తర్వాత ఈనెల 31న కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో జరిగే సభలో రజనీ పాల్గొని జనవరిలో తాను ప్రారంభించబోయే పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ సమావేశాన్ని ఎలాంటి హుంగులు ఆర్భాటాలు లేకుండా జరపాలని రజనీ ఇదివరకే మండ్రం నేతలకు ఆదేశాలిచ్చారు. ఈ సమావేశానికి రజనీ మక్కల్ మండ్రాలకు చెందిన నేతలు, ప్రముఖులు సహా సుమారు రెండు వేలమంది హాజరవుతారు.