ప్రపంచాన్ని ఇప్పుడు కొత్త కరోనా వైరస్ భయపెడుతోంది. యూకేలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అత్యంత వైభవంగా జరిగే క్రిస్మస్ వేడుకలు సైతం అక్కడ బోసిపోయాయి.
కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ గురించి విషయం బయటకు రావడంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఎందుకంటే యూకే నుంచి స్వదేశాలకు వస్తున్న వారిపై పూర్తి నిఘా పెట్టారు. భారత్తో పాటు పలు దేశాలు యూకేకు విమానాలను నిలిపివేశాయి. దీనిపై భారత్ కూడా అప్రమత్తంగా ఉంది. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ..వ్యాధి తీవ్రతలో ఎటువంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్కు కూడా వీకే పాల్ నేతృత్వం వహిస్తున్నారు. కొత్త కరోనాలోని జన్యుమార్పులు..వ్యాధి తీవ్రతపై అవి చూపే ప్రభావం గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త కరోనా కారణంగా మరణించే అవకాశం పెరగలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రెటరీ రాజేష్ భూషన్ తెలిపారు. అయితే..ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకూ తాము వెయ్యికి పైగా కేసుల్లో కరోనా శాంపిళ్లను పరీక్షించినా గానీ.. కొత్త కరోనా ఆనవాళ్లు కనిపించలేదని ఆయన తెలిపారు. ఏదిఏమైనప్పటికీ ప్రజల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ భయం మాత్రం ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకు కరోనా అన్లాక్ అంటూ యథేచ్చగా బయట తిరుగుతున్న వారు ఇప్పుడు ఈ కొత్త వైరస్ రాకతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.