చైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరిహద్దులో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ భారత్ విషయంలో తన చెడు వైఖరిని బయటపెట్టుకుంది. ఆరు నెలలకు పైగా సరిహద్దులో చైనా కారణంగా భారత్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో మనకు తెలిసిందే. ఇప్పుడు మరో విచిత్ర పని చైనా చేసింది.
చైనా కమ్యునిష్టు పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న మరో నిర్మాణం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. మయాన్మార్తో సరిహద్దు వెంబడి అత్యంత పొడవైన గోడను నిర్మిస్తున్నట్టు ఇటీవలే బయటపడింది. ముళ్లతీగలతో ఏర్పాటు చేస్తున్న ఈ గోడ ఏకంగా 2 వేల కిలోమీటర్ల పొడవు ఉంటుందని సమాచారం. మయాన్మార్ నుంచి దేశంలోకి ప్రవేశిస్తున్న అక్రమచొరబాటు దారుల్సి అడ్డుకోవడమే తమ లక్ష్యమని చైనా ప్రకటించుకుంది.
అయితే చైనా చేస్తున్న పనిని ఇతర దేశాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. చైనాలోని ప్రభుత్వవ్యతిరేకులు, తిరుగుబాటు దారులు దేశసరిహద్దు దాటకుండా ఉండేందుకే చైనా ఈ చర్యకు పూనుకుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. మయాన్మార్ కూడా చైనా తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ ఆర్మీ అధికారులు చైనా ప్రభుత్వానికి లేఖ రాసారు. ఇరు దేశాల మధ్య 1961లో కుదిరిన సరిహద్దు ఒప్పందం గురించి లేఖలో ప్రస్తావించారు. నాటి ఒప్పందం పక్రారం సరిహద్దు రేఖ వెంబడి ఇరు వైపులా 10 మీటర్ల వరకూ ఎటువంటి నిర్మాణం చేపట్టకూడదు.
తన చర్యలతో చైనా తాజాగా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని వారు పేర్కొన్నారు. మయాన్మార్ మీడియాలోని వార్తల ప్రకరాం.. డిసెంబర్ లోని ఈ ముళ్లగొడ ఏర్పాటు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వ వర్గాల్లోనూ చైనా చర్యల పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. విస్తరణవాదంతో కదనుతొక్కుతున్న చైనా కారణంగా రాబోయే దశాబ్దాల్లో దక్షిణాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఇలా చైనా ప్రతి దేశం సరిహద్దులో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.