దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే అనిపిస్తున్నా ప్రధానమైన ప్రాంతాల్లో కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగించే అంశంగా ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో రికవరీ రేటు ఎక్కువగానే ఉంది. అయితే ఇదే సమయంలో కరోనా సోకినా తగ్గిపోతుందిలే అన్న భావన పలువురిలో ఉంది. అయితే ఒక్కసారి కరోనా వస్తే ఆ తర్వాత దాని ప్రభావం ఎక్కువ కాలం ఉంటుందన్న భయం వైద్యులు వ్యక్తంచేస్తున్నారు.
మద్రాస్ ఐఐటీలో కరోనా కేసుల సంఖ్య 191కి పెరగడంతో తమిళనాడు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్థులకు కొవిడ్-19 పరీక్షలు చేయాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అన్నా యూనివర్శిటీలో ఆరుగురు విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. మద్రాస్ ఐఐటీలో విద్యార్థులకు కరోనా సోకిన నేపథ్యంలో అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయాలని తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి జే రాథాకృష్ణన్ ఆదేశించారు. ఐఐటీ విద్యార్థులు, మెస్ వర్కర్లు 1000 మందికి కరోనా పరీక్షలు చేశారు.
చివరి సంవత్సర విద్యార్థుల కోసం కళాశాలలను ప్రారంభించారు. కరోనా ప్రబలడంతో విద్యార్థులు ఇంటి నుంచి చదువుకోవాలని మద్రాస్ ఐఐటీ అధ్యాపకులు ఆదేశించారు. మద్రాస్ ఐఐటీలో 16 మంది మెస్ వర్కర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. కళాశాల క్యాంపస్ లలో విద్యార్థులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని తమిళనాడు సీఎం ఆదేశించారు. తమిళనాడు రాష్ట్రంలో మంగళవారం 1132 కొత్త కరోనా కేసులు నమోదైనాయి. తమిళనాడులో 8,01,161 కరోనా కేసులు నమోదు కాగా వారిలో 11,919మంది మరణించారు.