బీహార్ ఎన్నికలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఎన్డీయే, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం సాగింది. అయితే అన్నింటిని పక్కకు నెట్టేసి ఎన్డీయే అధికారం చేపట్టింది. కాగా బీహార్ ఎన్నికల్లో ప్రధానంగా కరోనాకు ఉచిత వ్యాక్సిన్ ఇస్తామన్న హామీ బీజేపీ ఇచ్చింది. అయితే దీనిపై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది.
ఎన్నికల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎన్నికల హామీలు ఇవ్వడం ఏంటన్న విమర్శలు దేశంలోని అన్ని వర్గాల నుంచి ఎదురయ్యాయి. అయితే వీటన్నింటినీ బీజేపీ జయించింది. ఎన్నికల్లో కరోనా వ్యాక్సిన్ హామీ ఇవ్వడం సరైందే అని చివరకు ఎన్నికల సంఘం కూడా చెప్పేసింది. ఇప్పుడు ఆ హామీని అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అందరికీ ఉచిత వ్యాక్సిన్ అన్న దానిపై ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి కేబినెట్ భేటీ జరిగింది. ఇందులోనే అందరికీ వ్యాక్సిన్ అన్న దానిపై ఆమోద ముద్ర వేశారు. బిహార్లోని ప్రతి వ్యక్తికీ ఉచితంగా కరోనా వైరస్ అందేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హోంవర్క్ చేయాలని సీఎం నితీశ్ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిచే పద్ధతులపై అధ్యయనం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మొట్ట మొదట ఆరోగ్య కార్యకర్తలకు అందిస్తామని… దీనిపై సమగ్ర విధానంతో త్వరలోనే ప్రజల ముందుకు వెళ్తామంటున్నారు.