కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్క సారి కరోనా వస్తే అది శరీరంలోని ఇతర భాగాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే ఇదే సమయంలో ఆస్తమా రోగులకు మాత్రం ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్లో ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయమొకటి వెలుగు చూసింది. ఆస్థమాతో సతమతమయ్యే వారికి కరోనా సోకే అవకాశం తక్కువంటూ శాస్త్రవేత్తలు ఆశ్చర్యకర ప్రకటన చేశారు.
ఇజ్రాయెల్కు చెందిన హెల్త్ మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్లోని సమాచారం ఆధారంగా శాస్త్రవేత్తలు ఆస్థమా రోగులపై విస్తృత అధ్యయనం చేశారు. వీరిలో యూదు జాతి వారితో పాటూ అరబ్బులు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ కరోనా బారిన పడ్డ వారిని ఈ అధ్యయనం కోసం ఎంపిక చేశారు. మొత్తం 37 వేల మంది జరిగిన ఈ పరిశోధనలో పలు ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
మొత్తం 37 వేల మందిలో దాదాపు 6 శాతం మంది వివిధ సమయాల్లో కరోనా బారిన పడ్డట్టు తెలిసింది. అయితే..కరోనా రోగుల్లో ఆస్తమా ఉన్న వారి సంఖ్య కేవలం 6 శాతంగా ఉన్నట్టు తేలింది. గణాంకాలతో సహా చెప్పుకోవాలంటే..కరోనా సోకని ఆస్థమా రోగుల సంఖ్య 3 వేల పైచిలుకు కాగా.. కరోనా బారిన పడ్డ ఆస్థమా రోగుల సంఖ్య కేవలం 153. దీంతో..ఆస్తమా రోగులకు కరోనా సోకే అవకాశం తక్కువనే అంచనాకు శాస్త్రవేత్తలు వచ్చారు. ఇక ఈ ఫలితాలపై నిపుణులు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. ఈ విషయంలో మరింత అధ్యయనం జరిగే వరకూ తొందరపాటు అంచనాలు వేసుకోవద్దని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న మరో శాస్త్రవేత్త యూజీన్ మెర్జాన్ కూడా ఇదే సూచన చేశారు. తమకు కరోనా రిస్క్ ఎక్కువని భావించడం వల్ల ఆస్థమా రోగులు ఎక్కువ జాగ్రత్తలు పాటించి ఉండవచ్చని, అందుకే కరోనా బారిన పడ్డ ఆస్తమా రోగుల సంఖ్య తక్కువగా ఉండొచ్చని యూజీన్ స్పష్టం చేశారు.