దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. దీంతో పలు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మళ్లీ ఆంక్షలు పెడుతున్నాయి. అయితే దేశం మొత్తం ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసమే ఎదురుచూస్తోంది. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చినా దేశ వ్యాప్తంగా పంపిణీ చేయాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది.
సాధారణంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు 8 నుంచి 10 ఏళ్లు పడుతుంది. అయితే కరోనా మహమ్మారి విలయతాండవం దృష్ట్యా వ్యాక్సిన్ త్వరితగతిన అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. భారత్లో కూడా కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో మనం 16 నుంచి 18 నెలల వ్యవధిలోనే వ్యాక్సిన్ సిద్ధం చేస్తున్నామన్నారు.
దేశం మొత్తం మీద టీకాలు వేయడం గురించి ప్రభుత్వం ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అందరికీ టీకాలు వేస్తామని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదన్నారు. తమ ఉద్దేశం కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టాలని, దీనిలో విజయవంతమైంతే, అందరికీ టీకాలు వేయాల్సిన అవసరం లేదన్నారు. కాగా పంజాబ్, రాజస్థాన్, హరియాణాలలో కరోనా మరోమారు విజృంభిస్తున్నదని, ఆయా ప్రాంతాల్లోని ప్రజలు కరోనా కట్టడి నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.