కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ కరోనా బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే తల్లి కడుపులో ఉన్న బిడ్డకు కరోనా సోకదని ఇప్పటివరకు అందరూ అనుకుంటూ ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ సంఘటన దీనిపై తీవ్రంగా ఆలోచించేలా చేస్తోంది.
ఇటీవల సింగపూర్లో జన్మించిన శిశువులో పుట్టుకుతోనే కరోనా నిరోధక యాంటీబాడీలు ఉన్నట్టు అక్కడి వైద్యులు గుర్తించారు. తల్లి కుడుపుతూ ఉండగానే కరోనా బారిన పడ్డట్టు వారు తెలిపారు. శిశువు కరోనా సోకనప్పటికీ శరీరంలో కరోనా వైరస్ యాంటీబాడీలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అక్కడి నేషనల్ యూనివర్శిటీ ఆస్పత్రిలో సదరు మహిళ ప్రసవించినట్టు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటన శాస్త్రవేత్తల మధ్య చర్చకు దారి తీసింది. తల్లి నుంచి గర్భస్థ శిశువులకు కరోనా సంక్రమిస్తుందో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న శాస్త్రవేత్తలకు ఈ ఘటన మరిన్ని ఆధారాలు ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
కాగా ఇప్పటి వరకు తల్లి కరోనా బారిన పడినా కడుపులో ఉన్న శిశువుకు మాత్రం కరోనా సోకదన్న ధైర్యంతో ఉన్నారు. వారందరికీ ఈ వార్త ఆందోళన కలిగించేదే అని చెప్పాలి. కాగా.. కరోనా వర్టికల్ ట్రాన్స్మిషన్(తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించడం) గురించి తమ వద్ద పూర్తి సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో తెలిపింది. గర్భస్థ శిశువుకు వ్యాధి సంక్రమిస్తుందా లేదా డెలివరీ సమయంలో వైరస్ సోకుతుందా అనే అంశంలో పూర్తి స్పష్టత లేదని పేర్కొంది. అయితే.. తల్లి ద్వారా శిశువులకు కరోనా సోకడం చాలా అరుదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.