పాకిస్తాక్ సరిహద్దులో అలజడులు సృష్టిస్తూనే ఉంది. అవకాశం దొరికితే భారత్లో దాడులు చేసేందుకు సిద్దమవుతూనే ఉంది. తాజాగా జమ్మూలోని ఆర్ఎస్ పురా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద శనివారం రాత్రి పాకిస్తాన్ డ్రోన్ ఎగురుతూ కనిపించింది. దీంతో బీఎస్ఎఫ్ అధికారులు ఆ డ్రోన్పై కాల్పులు జరపడం ప్రారంభించారు.
అధికారులు ఒక్కసారిగా కాల్పులతో విరుచుకుపడటంతో పాక్ డ్రోన్ వెనక్కి మళ్లింది. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ అధికారులు ధ్రువీకరించారు. ‘‘ఆర్ఎస్ పురా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో పాక్ డ్రోన్ ఎగురుతూ కనిపించింది. బీఎస్ఎఫ్ అధికారులు కాల్పులు జరపడంతో డ్రోన్ పాక్కు వెళ్లిపోయింది. అయినా మేము సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం.’’ అని బీఎస్ఎఫ్ పేర్కొంది. ఓ వారం క్రితం కూడా మేంధర్ సెక్టార్ ప్రాంతంలో పాక్ డ్రోన్ ఎగురుతూ కనిపించింది. ఆర్మీ అధికారులు కాల్పులు ప్రారంభించడంతో తోక ముడిచింది.
పాకిస్తాన్ వక్రబుద్ది తెలిసిన భారత్ ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంది. ఇటీవల నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. జమ్మూ-కశ్మీరులోని రాజౌరీ జిల్లాలో, నౌషేరా సెక్టర్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీంతో ఓ భారతీయ జవాను అమరుడయ్యారు. పాకిస్థాన్ దళాలకు భారతీయ దళాలు దీటుగా బదులిస్తున్నట్లు భారత సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పేర్కొంది.