ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు ఐదు రోజులపాటు జరిగే అవకాశమున్నట్లు సమాచారం. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అసెంబ్లీ, శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ నేతలకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు అందరూ సిద్ధం కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలకు సూచించారు. హోమ్వర్క్ చేయకుండా సభకు వస్తే అబాసు పాలవుతామని హెచ్చరించారు. అలాగే శాసన మండలిలో వ్యూహంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ విషయంలో మంత్రి బుగ్గన సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గించమని స్పష్టం చేశారు. ఎత్తు తగ్గిస్తామని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు.
ఇక తెలుగుదేశం పార్టీ సైతం అసెంబ్లీలో ఏం చేయలన్న దానిపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పోలవరం నిధులు, అమరావతి భూముల విషయం, ఆలయాలపై దాడుల విషయం, కరోనా కట్టడి విషయంతో పాటు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వాడీవేడీగా మాట్లాడేందుకు టిడిపి అన్నివిధాలా సిద్ధమవుతోంది. ఇరు పక్షాలు ఈ సారి అసెంబ్లీలో ఎలా ముందుకు వెళతాయన్న దానిపైనే రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.