కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ఢిల్లీలో ధర్నాకు వెళ్లిన రైతులు ఎట్టకేలకు ఢిల్లీలోపలికి వెళ్లారు. వీరిని పోలీసులు అనుమతించారు. పోలీసుల పహారాలోనే రైతులు నగరంలోనికి వెళ్లారు. అయితే అంతకుముందు రాం లీలా మైదానంలోకి అనుమతి ఇవ్వాలని రైతులు మోదీకి బహిరంగ లేఖ రాశారు.
వ్యవసాయ బిల్లులపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో రైతు సంఘాలతో చర్చలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సూచించారు. పరిస్థితి రోజు రోజుకూ తీవ్రమవుతోందని, దీన్ని ఇలాగే వదిలి పెట్టకూడదని ఆయన హితవు పలికారు. ఢిల్లీకి బయల్దేరిన రైతులను హర్యానా పోలీసులు అడ్డుకోవడం, ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ రేకెత్తడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అమరీందర్ సింగ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు సరికదా… మరింత పట్టు బిగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఢిల్లీకి చేరుకుంటామని, తమ ఆందోళనను కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని, ప్రభుత్వం రోడ్డుపైకి వచ్చి మాట్లాడేంత వరకూ, తమ డిమాండ్లను నెరవేర్చే వరకూ ఉద్యమిస్తూనే ఉంటామని రైతులు పేర్కొంటున్నారు. తాము ఎవరితోనూ చర్చలు జరపమని, నేరుగా ప్రధాని నరేంద్ర మోదీతోయే తాము చర్చలు జరుపుతామని కరాఖండిగా తేల్చి చెబుతున్నారు. ఆకలి చావులతో అయినా చస్తాము కానీ… ఆందోళనను విరమించమని, ఢిల్లీకి తప్పకుండా చేరుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పరిస్థితి కొంత ఆందోళన కరంగా మారింది. పోలీసులు బారికేడ్లు పెట్టినా, ఆంక్షలు విధించినా, వాటర్ కెనన్లు వాడినా, తమ గమ్యం మాత్రం ఢిల్లీయే అని తేల్చి చెబుతున్నారు.