దేశ రాజధాని ఢిల్లీలో కరోనా భయాందోళనకు గురిచేస్తూనే ఉంది.
ఢిల్లీలో గత 24 గంటల్లో 6,224 కొత్త కేసులు నమోదు కాగా, వారిలో 4,943 మంది కోలుకున్నారు, 109 మరణాలు చోటుచేసుకున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 5,40,541కి చేరుకున్నాయి. వీరిలో 4,93,419 మందికి స్వస్థత చేకూరగా, 38,501 యాక్టివ్ కేసులు ఉన్నారు. మృతుల సంఖ్య 8,621కి చేరింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 480 మంది మృత్యువాత పడ్డారు.
కరోనా మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో ఐసీయూ పడకలను ఢిల్లీ ప్రభుత్వం పెంచింది. గురు తేజ్ బహదూర్ ఆసుపత్రిలో గరష్టంగా 232 పడకలు, లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణన్ ఆసుపత్రిలో అదనంగా 200 పడకలు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కరోనా పేషెంట్ల కోసం ఢిల్లీలో 9,000కు పైగా రెగ్యులర్ పడకలు, 1000కి పైగా ఐసీయూ పడకలు అందుబాటులో ఉంచారు.
కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తుండడంతో మధ్యప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు కొన్ని నిబంధనలను కఠినతరం చేశాయి. జన సంచారాన్ని తగ్గించడంతో పాటు ప్రజలు గుంపులు కట్టకుండా చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలైతే రాత్రి సమయాల్లో కర్ఫ్యూని అమలు చేస్తున్నాయి. తాజాగా పంజాబ్ ప్రభుత్వం సైతం ఇదే నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు