సూపర్ స్టార్ రజినీకాంత్తో కేంద్ర హోం మంత్రి సమావేశం అవుతారని ప్రచారం జోరుగా సాగింది. అయితే చెన్నై పర్యటనకు వచ్చిన అమిత్షా రజినీతో ఇప్పటి వరకు మాట్లాడలేదని తెలిసింది. అయితే ఓ అత్యవసర సమావేశంలో మాత్రం ఆయన పాల్గొని రజినీకాంత్ గురించి డిస్కషన్ చేసినట్లు సమాచారం అందుతోంది.
చెన్నై పర్యటనకు వచ్చిన అమిత్షా రజినీకాంత్ సమావేశం అవ్వకపోయినా కనీసం వీడియో కాల్లో అయినా మాట్లాడతారని అందరూ అనుకున్నారు. అయితే అది కూడా జరగలేదని తెలుస్తోంది. ఆరెస్సెస్ సిద్ధాంతకర్త గురుమూర్తి కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలోనే రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ఆయన గురుమూర్తితో చర్చించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్తో గురుమూర్తి భేటీ అయ్యారు. తమిళనాట రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, రాజకీయ అరంగేట్రంపై పునరాలోచించుకోవాలని సూపర్ స్టార్ను గురుమూర్తి అభ్యర్థించారు. ఈ సమావేశంలో రజనీకాంత్ వెలిబుచ్చిన అభిప్రాయాలు, రజనీకాంత్ మనసులోని అంతరంగం… ఇలా పలు అంశాలను గురుమూర్తి కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వివరించారు.
ఇక ముందు నుంచీ అనుకున్నట్లు రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెడతారని అనుకున్నా వైద్యుల సూచన మేరకు అది జరగలేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీలోకి రజినీని ఆహ్వానించాలన్న ఆలోచన ఉంది. అమిత్షా చెన్నై పర్యటనలో రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ఆరా తీశారు. ఆదివారం జరిగిన ఈ సమావేశం ఎంతో కీలకమైనదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రజినీ కాంత్ను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఏం చేయాలన్న దానిపై ఆలోచనలు చేస్తోంది. రాజకీయాల్లోకి వెళ్లకూడదని తనకు వైద్యులు సూచించారని రజనీకాంత్ వ్యాఖ్యానించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో ఆరెస్సెస్ సిద్ధాంత కర్త గురుమూర్తి రజనీకాంత్ నివాసానికి వెళ్లి… ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. రజనీకాంత్ వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని… బీజేపీ అధిష్ఠానం తదుపరి వ్యూహాన్ని సిద్ధం చేస్తుందని తమిళనాడు బీజేపీ నేతలు అంటున్నారు.