ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బయటకు వెళ్లేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్న ఘటన అందరి కళ్లు తెరిపించింది. ఇద్దరు యువకులు మృతిచెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లా బిరోదాకు చెందిన 19 ఏళ్ల ఇర్ఫాన్, 16 ఏళ్ల కలీమ్ స్నేహితులు. వారిద్దరూ సాయంత్రం 6 గంటల సమయంలో రైల్వే ట్రాక్పై నడుస్తున్నారు. ఈ సమయంలో వారు చెవులలో ఇయర్ ఫోను పెట్టుకుని ఏదో వింటున్నారు. ఇంతలో వారు ఊహించని విధంగా అటుగా వచ్చిన కర్నాటక ఎక్స్ప్రెస్ వారిని ఢీకొంది. దీంతోవారు అక్కడికక్కడే మృతిచెందారు.
వీరి శరీరాలు 50 ముక్కలుగా మారి, రైల్వే ట్రాక్కు సుమారు వంద మీటర్ల దూరం వరకూ కనిపించాయి. వీటిని గమనించిన స్థానికులు రైల్వేట్రాక్ వద్దకు చేరుకుని మూడు గంటల పాటు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ రూటులో నిడిచే రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. ఈ ప్రమాద వివరాలను రైలు డ్రైవర్ ఉన్నతాధికారులకు తెలియజేశాడు. ఘటన జరిగిన సమయంలో తాను హారన్ మోగించినప్పటికీ, వారు వినలేదని డ్రైవర్ అధికారులకు తెలిపాడు. ఈ కారణంగానే ప్రమాదం జరిగిందన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ విషయం బయటకు తెలియడంతో అందరూ ఒక్కసారిగా టెన్షన్కు గురవుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇయర్ ఫోన్స్ , బ్లూ టూత్ లేనిదే చాలా మంది బయటకు రావడం లేదు. చాలా సందర్బాల్లో బైక్ రైడర్స్ వీటి వల్ల వెనకాల నుంచి వచ్చే వాహనాలను గుర్తించలేకపోయి ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. కాగా ఇలా రైలు పట్టాలపై ఎందుకు నడుచుకుంటూ వెళ్లారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.