దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇది ప్రజల ప్రాణాలకే ముప్పు అయ్యేంతగా ఉంది. ప్రధానంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇప్పుడు పరిస్థితులు మరీ దారునంగా ఉన్నాయి. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఇటీవల పలు అనారోగ్య కారణాల వల్ల ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులు సోనియా గాంధీ ఉండటానికి అంత అనుకూలంగా లేదని తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి బయటికి వెళ్లాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వైద్యులు సూచించినట్లు సమాచారం. ఢిల్లీలో నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్యులు ఆమెకు ఈ సలహా ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సోనియా గాంధీ కొంత కాలంగా ఛాతి ఇన్ఫెక్షన్తో బాధడుతున్నారు. జూలై 30 న ఆమె గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత సెప్టెంబర్ మాసంలో సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమై కొన్ని రోజుల పాటు ఆమె విదేశాలకు వెళ్లారు.
అప్పటి నుంచి ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఢిల్లీలోని కాలుష్యం కారణంగా ఉబ్బసం వచ్చే అవకాశం ఉందని, అంతేకాకుండా ఛాతి నొప్పి కూడా తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయని, అందుకే ఇతర ప్రాంతానికి షిఫ్ట్ కావాలని సోనియాకు వైద్యులు సూచించారు. ఈ సూచనలతో సోనియా గోవా లేదా చెన్నైకి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సోనియాతో పాటు రాహుల్ లేదా ప్రియాంక కూడా వెళ్లనున్నట్లు సమాచారం. సోనియా గాంధీ ఆరోగ్యంపై వస్తున్న వార్తలతో పార్టీ శ్రేణులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.