మున్సిపాలిటీ చెత్త డంపింగ్ యార్డులో మూడు లక్షల విలువైన బంగారం ఉన్న ఆశ్చర్యకర సంఘటన మహారాష్ట్రలోని పూనేలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే పూణేకి చెందిన రేఖ అనే మహిళ పండుగ వస్తున్న నేపథ్యంలో ఇంటిని మొత్తం శుభ్రం చేసింది.
ఈ హడావిడిలో చెత్తలో కలిపి తన ఇంట్లో ఉన్న బంగారం బ్యాగును కూడా వేసింది. దాదాపు రెండు గంటల తర్వాత చెత్తలో బంగారంతో ఉన్న బ్యాగ్ కూడా వేసినట్లు గుర్తించింది. వెంటనే మున్సిపల్ అధికారులను కలిసి విషయాన్ని తెలిపింది. అధికారితో కలిసి చెత్త డంపింగ్ చేసే ప్రాంతానికి వెళ్లగా అప్పటికే ఆమె నివాసం ఉండే ఏరియా నుంచి తెచ్చిన చెత్తను సిబ్బంది డంప్ చేశారు. అయినప్పటికీ వారిని ప్రాదేయపడింది. ఇందులో విలువైన బంగారం ఉందని, తన మంగళసూత్రం కూడా ఇందులోనే ఉందని తెలిపింది. దీంతో మున్సిపల్ సిబ్బంది 18 టన్నుల చెత్తలో ఆమె బ్యాగు కోసం వెతుకులాట ప్రారంభించి 40 నిమిషాల తర్వాత బ్యాగును గుర్తించారు.
తన నగలు మళ్లీ కనిపించడంతో రేఖ ఆనందం వ్యక్తం చేస్తోంది. తన కోసం ఇంత కష్టపడిన మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. చెత్తలో బంగారంతో ఉన్న బ్యాగ్ దొరకడంతో మున్సిపల్ సిబ్బంది కూడా షాక్ అయ్యారు. ఈ విషయం తెలిసిన వారంతా కాస్త వెనకా ముందు చూసుకోవాలని కదా అని అంటున్నారు. హడావిడిలో చేసే పనులు ఎంతదూరమైన తీసుకెళతాయనడానికి ఇదే ఉదాహరణ.