ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి ఆయన చెప్పారు. కాగా ఇటీవల ఏపీ అప్పులు తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పోలవరం నిర్మాణం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. డిజైన్లలో ఎలాంటి మార్పులు ఉండవని…ప్రాజెక్ట్ పై ప్రతిపక్షాలు చేస్తున్నది దుష్ప్రచారమని మండిపడ్డారు. ప్రభుత్వాలకు నిధుల కొరత ఎప్పుడు ఉంటుందని తెలిపారు. నిధుల కొరత లేదు అంటే అది నాన్ పెర్ఫార్మింగ్ గవర్నమెంట్ కింద లెక్క అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం నిధులు ఖర్చవుతాయని…వాటిని తిరిగి సమకుర్చుకుంటూ ఉంటాయని.. ఇది నిరంతర ప్రక్రియ అని ఎంపీ పేర్కొన్నారు.
అమ్మోనియం నైట్రేట్ నిల్వల దిగుమతి కోసం మూడు ఓడలు ఎదురు చూస్తున్నాయని చెప్పారు. అమ్మోనియం నిల్వలను విశాఖలో నిల్వ చేయకండా నేరుగా పరిశ్రమలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నుంచి వచ్చిన ఆదేశాలు ఆధారంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. వివిధ వర్గాలవారికి ఇస్తున్న పింఛన్ల పెంపుపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఇక సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులు ఏపీకి చాలా అవసరం. ఈ పరిస్థితుల్లో అప్పులు తీసుకునేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తోంది.