దేశంలో ఏం జరుగుతుందో అని అన్ని రాజకీయ పార్టీలు బీహార్ వైపు చూశాయి. అయితే ఊహించని విధంగా ఎన్డీయేకు వ్యతిరేకంగా సర్వేలు తేల్చి చెప్పాయి. కానీ సర్వేలను తలక్రిందులు చేస్తూ బీహార్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడనుంది. ప్రజలు భారీ మెజార్టీతో మోదీని గెలిపించారని చెప్పొచ్చు.
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే గెలిచినప్పటికీ జేడీయూ వెనుకబడింది. మోదీ మాత్రం ఈ ఎన్నికలతో మరోసారి చరిత్ర తిరగరాశారు. ఎన్డీఏ కూటమి మొత్తం 125 సీట్లను దక్కించుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 122 సీట్లు కావాల్సివుండగా, ఎన్డీఏ కూటమి దానికన్నా మూడు సీట్లను అధికంగా గెలుచుకుంది. బీహార్లో 110 స్థానాల్లో బీజేపీ పోటీ చేసి 73 స్థానాలు గెలుచుకోగా.. 115 స్థానాల్లో పోటీ చేసిన జేడీయూ 43 స్థానాల్లో గెలిచింది. తాజాగా బీహార్ ఫలితాలపై మోడీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
ఎన్డీయే కూటమికి భారీ విజయం కట్టబెట్టినందుకు బిహార్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు ప్రకటించారు. అభివృద్ధే తమ అభిమతమని, ప్రాధాన్యత అని ప్రజలు చాటి చెప్పారన్నారు. కొత్త దశాబ్దం బిహార్ స్వావలంబన కోసమే అని యువత కూడా చాటి చెప్పారన్నారు. ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాంతం సమతౌల్య అభివృద్ధి కోసం ఎన్డీయే ప్రజాప్రతినిధులు అంకిత భావంతో పని చేస్తారని హామీ ఇస్తున్నాను. ప్రజాస్వామ్యం ఎలా బలపడుతుందో బిహార్ ప్రపంచానికి తెలియజేసిందన్నారు. 15 సంవత్సరాల పాలన తర్వాత కూడా ఎన్డీయే సుపరి పాలనకే ప్రజలు పట్టం కట్టారన్నారు. ఈ ఫలితాలు మోదీకి మరింత రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చాయి.