ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంలను ఎంవీఎంలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. అంటే వీటిని మోదీ వోటింగ్ మిషన్ అని రాహుల్ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
మోదీ వోటింగ్ మిషన్లకు, మోదీ అనుకూల మీడియాకు భయపడబోనని రాహుల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా తాను యుద్ధం చేస్తున్నానని రాహుల్ అన్నారు. మోదీ ఆలోచనలకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని. ఆయన ఆలోచనలను ఓడిస్తానని చెప్పారు. నరేంద్ర మోదీ తన సభల్లో నా గురించి బాధాకరమైన విషయాలు మాట్లాడుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. అయితే వారు ఎంత ఎక్కువ విద్వేషాన్ని చిమ్మితే అంత ఎక్కువగా తాను ప్రేమను వ్యాప్తి చేస్తానన్నారు.
నరేంద్ర మోదీని జయించే వరకు తాను దీన్నుంచి ఒక్క అడుగు కూడా కదలనని రాహుల్ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో మోదీ, రాహుల్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. మొన్న రాహుల్, తేజస్వీలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ డబుల్ డబుల్ యువరాజులు ఇక్కడ ఉన్నారని వ్యంగంగా మాట్లాడారు. అభివృద్ధి చేస్తున్న నితిష్ వైపే ప్రజలు ఉంటారని మోదీ అంటున్నారు. ఇప్పుడు రాహుల్ తన స్టైల్లో కౌంటర్ ఇస్తున్నారు. లాక్డౌన్ లాంటి సంక్లిష్ట సమయంలో ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. కానీ… ఇప్పుడు మాత్రం ఓట్లడుగుతున్నారని విమర్శించారు. ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేర్చడంలో నితీశ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. లాక్డౌన్ సమయంలో ప్రధాని మోదీ, సీఎం నితీశ్ పేదలకు, కూలీలకు చేసిందేమీ లేదు. పైగా వారిపై లాఠీఛార్జ్ చేయించారు. ఇప్పుడేమో ఓట్లు అడుగుతున్నారు. నిజంగా మోదీకి వారిపై ప్రేమ ఉంటే.. లాక్డౌన్ సమయంలో అలా వ్యవహరించి ఉండేవారే కాదని రాహుల్ అన్నారు.