జమ్ముకశ్మీర్లో పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్నాయి. ఓ వైపు ఉగ్రవాదులు రెచ్చిపోతుంటే మరో వైపు రాజకీయ నాయకులు కూడా మాటల తూటాలు పేలుస్తున్నారు. దీంతో మరోసారి జమ్ముకశ్మీర్ రెగ్యులర్గా వార్తల్లోకెక్కుతోంది.
జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో గురువారం రాత్రి ముగ్గురు బీజేపీ కార్యకర్తలను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఖాజిగుండ్ ప్రాంతంలోని వైకె పొరా గ్రామంలో బీజేపీకి చెందిన ముగ్గురు కార్యకర్తలపై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో కుల్గాం జిల్లా బీజేపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ యాటూ కుమారుడు ఫిధాహుసేన్ యాటూ, ఉమర్ రషీద్ బీగ్, ఉమర్ రంజాన్ హజామ్ లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా, వారు మరణించారని వైద్యులు ప్రకటించారు. ఈ విషయంపై మోదీ స్పందించి ఘటనను ఖండించారు.
ఉగ్రవాదులు ఇలా రెచ్చిపోతుంటే రాజకీయ నాయకులు కూడా జమ్ముకశ్మీర్ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ పునరేకీకరణ జరిగేంత వరకూ, ఆర్టికల్ 370 పునరుద్ధరించే వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. గతంలో దేశంలోని అన్ని రాష్ట్రాల విభజన కూడా ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే జరిగాయని పేర్కొన్నారు. పంజాబ్ ను మూడు రాష్ట్రాలుగా విభజించే సమయంలోనూ ప్రజల మద్దతు ఉండేదని, బిహార్ ను రెండు రాష్ట్రాలుగా విభజించే సమయంలో ప్రజలు మద్దతిచ్చారని గుర్తు చేశారు. వీటితో యూపీ, ఏపీ విభజన సమయాల్లోనే ప్రజలు మద్దతిచ్చారని ఒమర్ పేర్కొన్నారు.
అయితే జమ్మూ కశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన సమయంలో మాత్రం నిర్బంధం విధించిన ప్రకటించారని, ఇలా ప్రకటించడం ఇదే ప్రథమమని మండిపడ్డారు. ఈ నిర్ణయానికి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఆమోదం లేదని, సీఎం కూడా దీనిపై సంతకం చేయలేదన్నారు. ఈ నిర్ణయానికి తామెంత మాత్రం ఆమోదయోగ్యులుగా లేమని ఒమర్ తెలిపారు. ఈ వ్యాఖ్యలతో జమ్మకశ్మీర్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.