ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లు జరుగుతుందా అంటే కచ్చితంగా కాదనే చెబుతారు. ఇప్పుడు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇదే చెబుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కమీషన్, ప్రభుత్వం కలిసి సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఎన్నికల నిర్వహించేందుకు ఇష్టపడటం లేదు. కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎన్నికల కమీషన్ మాత్రం ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. దీంతో ఈ విషయాలపై మంత్రి అనిల్ మాట్లాడారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. చంద్రబాబు చెప్పినట్టు ఇక్కడ జరగవని.. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై మంత్రి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉండి జూమ్ మీటింగ్ల ద్వారా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలా చేయడం మంచిది కాదన్నారు. చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. నాడు నేడు కింద స్కూళ్ల అభివృద్ధిని చంద్రబాబు పరిశీలించి మాట్లాడాలని మంత్రి అన్నారు. పాఠశాలల రూపు రేఖలు మార్చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా ఏ విదంగా ప్రజలకు సేవలు అందుతున్నాయో తెలుసుకోవాలన్నారు. ఇక చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉంటూ పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్న విధానంపై పలువురు సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అధినేత ప్రజల్లోకి రాలేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని టిడిపి శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.