ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోలవరం ప్రాజెక్టుపై మాటల దాడులు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైసీపీపై మండిపడుతోంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పోలవరంపై కేంద్రం నిర్ణయం తీసుకున్నా టిడిపి ఏం చేయలేదని వైసీపీ చెబుతోంది.
పోలవరం జాతీయ ప్రాజెక్టు అన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సోమవారాన్ని పోలవరానికి సంబంధించి సమీక్షలు చేసేందుకు చంద్రబాబు కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే అయినప్పటికీ ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ప్రాజెక్టులపై శ్రద్ద పెట్టారు. అయితే ఇప్పుడు వివాదం ఏంటంటే.. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిధుల్లో కొర్రీలు వేసిందని అంటున్నారు. దీనిపై వైసీపీ స్పందించింది.
2014 తర్వాత పెరిగిన అంచనాలను చెల్లించలేమంటూ 2017లో కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది. ఆ సమయంలో కేంద్ర కేబినెట్లో టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. సవరించిన అంచనాలను అంగీకరించమని కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు టీడీపీ మంత్రులు ఆనాడు ఎందుకు వ్యతిరేకించలేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు చేసిన తప్పుల వల్ల ఇప్పుడు కేంద్రం కొర్రీలు వేస్తోందని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని మంత్రి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సోమవారం చంద్రబాబు ఏం చేశారని అడుగుతున్నారు. పోలవరంపై వై.ఎస్ జగన్ కేంద్రానికి లేఖ రాస్తారని అనిల్ చెప్పారు. మరి ఈ విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తున్నది వేచి చూడాలి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పరిస్థితుల్లో నిధులు చాలా ముఖ్యం. మరి జగన్ ఎలా ముందుకు వెళతారో మరి.