ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి, ప్రతిపక్ష టిడిపికి మాటల యుద్ధం నడుస్తోంది. రోజుకో వివాదంపై ఇరు పార్టీల నేతలు ఘాటైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇరు పార్టీలు మాటల దాడికి సిద్ధమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో కరోనా రాకముందు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కరోనా కారణంగా ఎన్నికల కమీషనర్ ఎన్నికలను వాయిదా వేశారు. అయితే అప్పట్లో ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించాలని ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. అయితే ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయాన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై టిడిపి మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహించేందుకు వైసీపీ అడ్డుపడుతోందని అంటోంది. ప్రజా వ్యతిరేకత ఉన్నందుకే వైసీపీ ఎన్నికలను వెనుకంజే వేస్తోందని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అంటున్నారు.
ఇక ప్రభుత్వం మాత్రం ఎన్నికలపై క్లారిటీగా ఉంది. కరోనా కేసుల విజృంభణ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలని అనుకోవడం లేదని స్పష్టమవుతోంది. ఎందుకంటే దసరా తర్వాత కేసులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే నిపుణులు చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజల ఆరోగ్య కారణాల రిత్యా ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు. దీంతో ఎన్నికలు జరగవని అనుకోవచ్చు. కానీ టిడిపి మాత్రం ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందుకే ఎన్నికలు నిర్వహించడం లేదని అంటోంది. అయితే ఏడాదిన్నర క్రితం భారీ మెజార్టీతో అధికారం చేపట్టి జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా ఉత్సాహంతో ముందుకు వెళతారని పార్టీ శ్రేణులు అంటున్నారు. ప్రజల్లో తమకున్న బలంతో ఎప్పుడు ఎన్నికల నిర్వహించినా ఘన విజయం సాదిస్తామని చెబుతున్నారు.