సూపర్ స్టార్ రజినీ కాంత్ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు అర్థమవుతోంది. కొంత కాలంగా ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తారని అంటున్నా అది ఇంతవరకు నెరవేరలేదు. గత ఫిబ్రవరిలోనే తాను పార్టీ ప్రారంభిస్తానని, ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయనని, పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతానని రజినీ ప్రకటించిన విషయం తెలిసిందే.
అసెంబ్లీ ఎన్నికల్లోగా మండ్రాల్లో కొత్త సభ్యులను ముమ్మరంగా చేర్పించాలంటూ ఆ సంఘాల జిల్లా శాఖ నాయకులను రజనీకాంత్ నుంచి ఆదేశాలు అందాయని తెలుస్తోంది. దీంతో అన్ని జిల్లాల్లోని రజనీ మక్కల్ మండ్రాల్లో నేతలు సభ్యత్వ ఫారాలను పట్టుకుని తిరుగుతున్నారు. గత కొద్ది నెలలుగా నిశ్శబ్దం రాజ్యమేలిన రజనీ మక్కల్ మండ్రాల్లో సందడి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించేశాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రారంభించే దిశగా ప్రస్తుతమున్న మక్కల్ మండ్రాల్లో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు.
తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో ఆరు నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక రజినీ పార్టీ ప్రారంభించడమే మిగిలిందని అంతా అనుకుంటున్నారు. అందుకోసమే ఇప్పటి నుంచే ప్రణాళికా బద్దంగా సభ్యత్వాలు చేపించాలని చూస్తున్నారు. రానున్న రెండు నెలల కాలంలో ప్రతి జిల్లాలో 10 లక్షల సభ్యత్వాలు చేపించాలని రజినీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా రజినీకాంత్ రాజకీయ ప్రవేశం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన పార్టీ పెడితే మద్దతు తెలిపేందుకు ఎంతో మంది సిద్దంగా ఉన్నారు. ప్రస్తుతం సభ్యత్వ కార్యక్రమాలు జరుగుతుండటంతో పొలిటికల్ ఎంట్రీకి సమయం దగ్గరపడిందని అంతా అనుకుంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.