ఉపాధి పనుల కోసం ఇతర దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. సోమాలియాలో 33 మంది భారతీయులు చిక్కుకున్నారు. ఏడు నెలలుగా వారికి జీతాలు కూడా ఇవ్వడం లేదని తెలిసింది. దీంతో ఇప్పుడు వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ఉత్తరప్రదేశ్కు చెందిన 25 మందితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 8 మంది మొత్తం 33 మంది సోమాలియాకు ఉపాధి కోసం వెళ్లారు. అక్కడ ఓ పరిశ్రమలో పని చేసుకుంటూ ఉన్నారు. అయితే మొదట్లో వారికి కూలీ సరిగ్గానే ఇచ్చేవారు. అయితే 8 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో వాళ్లు భారత ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకొచ్చారు. తమను ఎలాగైనా ఆదుకోవాలని వేడుకున్నారు.
సోమాలియాలోని పరిశ్రమలో బందీలుగా ఉన్న 33 మంది భారతీయులను తిరిగి స్వదేశానికి రప్పించడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు. నైరోబిలోని భారత హైకమిషన్ అక్కడి అధికారులో సంప్రదింపులు జరుపుతోందని వివరించారు. కార్మికుల కష్టాలు తెలుసుకున్న ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించి, స్వదేశానికి తరలించడం కోసం చర్యలు తీసుకోవాలని సోమాలియాలోని ఇండియన్ హైకమిషన్ను అదేశించింది. అంతేకాకుండా భారత్లో ఉన్న సోమాలియా ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ట్విట్టర్లో వెల్లడించారు. మొత్తానికి పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి రావడం దురదృష్టకరం.