సంచలన వ్యాఖ్యలు చేసి దేశ వ్యాప్తంగా విమర్శలు మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ తగ్గడం లేదు. బీజేపీ అభ్యర్థి ఇమారతీ దేవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ సైతం దీనిపై స్పందించారు. అయినప్పటికీ ఆయన మాత్రం వెనక్కు తగ్గడం లేదు.
మధ్య ప్రదేశ్ శాసన సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్వాలియర్లోని డాబ్రా పట్టణంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్కు రాజీనామా చేసి, బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఇమారతీ దేవిని ఉద్దేశించి ఐటమ్ అని పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీ చేస్తున్న ‘ఐటమ్’లా కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి సింపుల్ పర్సన్ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దేశ వ్యాప్తంగా ఆయనపై విమర్శలు వచ్చిపడ్డాయి. చివరకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం దీనిపై స్పందించారు.
కమల్నాథ్ తన పార్టీ నేత అని, అయితే వ్యక్తిగతంగా తాను ఆయన ఉపయోగించిన భాషను ఇష్టపడనని చెప్పారు. అటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని చెప్పారు. రాహుల్ స్పందించిన తర్వాత కమల్నాథ్ దీనిపై స్పందించారు. అది రాహుల్ గాంధీ అభిప్రాయం. నేను ఆ స్టేట్మెంట్ ఏ ఉద్దేశంతో ఇచ్చానో ఇప్పటికే వివరణ ఇచ్చాను. ఎవరినీ అవమానించే ఉద్దేశం నాకు లేనప్పుడు ఎందుకు క్షమాపణ చెప్పాలి.. అవమానానికి గురయినట్టు ఎవరికైనా అనిపిస్తే దానికి నేను విచారం వ్యక్తం చేశాను.. అని కమల్నాథ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మరి ఈ వ్యాఖ్యలు ఇంకెంత దూరం వెళతాయో చూడాలి.