ఆంధ్రప్రదేశ్లో కురిసిన వర్షాలు, వచ్చిన వరదల వల్ల తీవ్ర నష్టం ఏర్పడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వై.ఎస్ జగన్ లేఖ రాశారు. పూర్తి వివరాలు పంపించిన జగన్ సహాయం చేయాలని కోరారు.
వర్షాలు, వరదల వల్ల ఏపీలో రూ. 4450 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని వై.ఎస్ జగన్ హోమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే తక్షణ సహాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. వరద బాదితులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కారణంగా ఆర్థికంగా నష్టపోయామని.. ఇప్పుడు వరదలతో కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. దీంతో సహాయం చేసి ఆదుకోవాలని కోరారు.
ఆగష్టు, సెప్టెంబరు నెలతో పాటు ఇప్పుడు కురిసిన వర్షాల గురించి లేఖలో వివరించారు. వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయన్నారు. అరటి, బొప్పాయి తోటలు కూడా దారుణంగా దెబ్బతిన్నట్లు జగన్ పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపి నష్టాన్ని అంచనా వేయాల్సిన అవరం ఉందన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కేంద్రం రాష్ట్రానికి అండగా ఉండాలన్నారు. తక్షణ సహాయంగా వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.