దుబాయ్ ఎయిర్పోర్టులో భారతీయులు చిక్కుకున్నారు. రెండు రోజులుగా వీరు దుబాయ్ ఎయిర్పోర్టులోనే ఉన్నట్లు తెలుస్తోంది. టూరిస్ట్ వీసాదారులకు దుబాయ్లోనికి ప్రవేశానికి కావాల్సిన అర్హతలు వీరికి లేకపోవడంతో అధికారులు విమానాశ్రయంలోనే నిలిపివేశారు.
దుబాయ్లో కొత్త రూల్స్ వచ్చాయి. ఈ రూల్స్ ప్రకారం రిటర్న్ టికెట్ లేకుండా విజిట్, టూరిస్ట్ వీసాలపై దుబాయ్కు వచ్చే ప్రయాణికులకు దేశంలో ప్రవేశానికి అనుమతి ఉండదు. అలాగే ప్రయాణికుడిని వారి దేశానికి తిరిగి తీసుకువెళ్లడం కోసం విమాన టికెట్ ఖర్చులను విమానయాన సంస్థనే భరించాలి. దీంతో ఈ నిబంధనల ప్రకారం ఇటీవల దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన చాలా మంది ప్రయాణీకులు అక్కడ ఎయిర్పోర్టులోనే ఉండిపోయారు.
భారతదేశం నుండి వచ్చిన సుమారు 200 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకున్నారు. వీరిలో గురువారం 140 నుంచి 150 మందిని తిరిగి భారత్కు పంపించడం జరిగింది. మరో 45 మంది ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ నిబంధనలను క్లియర్ చేసి యూఏఈలోకి ప్రవేశించగలిగారని దుబాయ్లోని భారత కాన్సుల్ ప్రతినిధి నీరజ్ అగర్వాల్ చెప్పారు. పలువురికి ఇండియన్ కాన్సులేట్ ఆహారంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించింది. కాగా పాకిస్తాన్కి సంబంధించిన 169 మంది ప్రయాణీకులను కూడా వెనక్కు పంపించారు. ఇక నుంచైనా దుబాయ్ వెళ్లే భారతీయులు అక్కడి రూల్స్ తెలుసుకొని వెళితే బాగుంటుంది.